“దసరా” లేదా “దేవి నవరాత్రులు” ఆశ్వయుజ మాసం శుక్లపక్షం యొక్క ప్రారంభ తొమ్మిది రోజులను సూచిస్తుంది. ఈ తొమ్మిది రోజులలో మూడు ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి: దుర్గాష్టమి, మహా నవమి మరియు విజయదశమి. ఈ సమయంలో సమాజంలోని ప్రతి సమూహానికి ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. విద్యార్థులు పుస్తకాలను పూజిస్తారు, కార్మికులు పనిముట్లను పూజిస్తారు, క్షత్రియులు దేవత నుండి అనుగ్రహాన్ని పొందేందుకు ఆయుధాలను పూజిస్తారు. పురాణాల ప్రకారం, మహిషాసురమర్దనిగా దేవి రాక్షసుడిపై స్ఫూర్తిదాయకమైన విజయం కారణంగా పూర్వం రాజులు ఈ పవిత్ర దినాలలో తమ సైనికులతో దండయాత్రలు చేసేవారని నమ్ముతారు.

దుర్గాష్టమి

దుర్గాదేవి “లోహుడు” అనే రాక్షసుని సంహరించడం వల్ల లోహం ఏర్పడిందని, దానివల్ల లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైందని చెబుతారు. దుర్గ అంటే దుర్గతులను తొలగించేది అర్ధం. దుర్గలోని “దుర్” అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. “గ” అంటే నాశనం చేసేది అని దైవజ్ఞులు వివరించేవారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన చెడుశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రాక్షసుల బాధలు దూరమవుతాయి. అందుకే మొదటి 3 రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి దుష్టశక్తుల నుండి విముక్తిని, తర్వాత 3 రోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి ధనసంపదలను, చివరి 3 రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు దుర్గా సహస్రనామ పారాయణంతో పాటు “దుం” బీజాక్షరంతో దుర్గాదేవిని పూజిస్తారు. దుర్గాష్టమి మంగళవారం వచ్చినచో మరింత శుభప్రదమని అంటారు.

మహా నవమి

మహానవమి అనేది నవరాత్రులలో తొమ్మిదవ రోజు. ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. ఈ రోజున దుర్గాదేవిని మనస్పూర్తిగా పూజించడం ద్వారా అన్ని కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. కొన్ని రాష్ట్రాలు ఈ పవిత్రమైన రోజున ఆయుధపూజ చేస్తారు. నవమి నాడు, నవరాత్రి యొక్క పవిత్రమైన తొమ్మిది రోజుల పండుగ హవన మరియు కన్యా పూజతో ముగుస్తుంది. ఇంకా, ఈరోజు విజయవాడలో కనకదుర్గను మహిషాసురమర్దిగా పూజిస్తారు, పంచదార పొంగలిని పవిత్ర నైవేద్యంగా సమర్పిస్తారు.

విజయదశమి

విజయదశమి రోజున, దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని మథనం చేసే దివ్య సంఘటన సమయంలో అమృతం వచ్చిందని చెబుతారు. “శ్రవణ” నక్షత్రంతో కలసి వచ్చే ఆశ్వీయుజ మాస దశమి రోజుకి “విజయ” అనే సంకేతమున్నది కనుకనే “విజయదశమి” అని అంటారు. తిధి, వార, తారాబలం, గ్రహబలం లేదా ముహూర్తం వంటి వాటిని పరిగణనంలోకి తీసుకోకుండా విజయదశమి రోజున ఏ పనినైనా మొదలుపెట్టినచో విజయం సాధించడం ఖాయం అని నమ్ముతారు.

విజయదశమి రోజున శమీపూజ చేయడం ఎంతో శుభదాయకం. శమీవృక్షమంటే “జమ్మిచెట్టు”. అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను మరియు వస్త్రాలను శమీవృక్షంపై దాచి వుంచారు. అజ్ఞాతవాసం పూర్తైన తరువాత పాండవులు ఆ వృక్ష రూపమును పూజించి తిరిగి ఆయుధాలను మరియు వస్త్రాలతో పాటు శమీవృక్ష రూపంలో ఉన్న “అపరాజితా” దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయయం సాధించారు.

శ్రీరాముడు విజయదశమి నాడు “అపరాజితా” దేవిని పూజించి, రావణ సంహారంతో విజయం సాధించాడు.

భక్తులు విజయదశమి రోజున జమ్మిచెట్టు వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

ఈ శ్లోకముతో పాటు కోరికలను వ్రాసుకున్న చీటీలు జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు.

Categorized in: